– మంత్రి పయ్యావుల కేశవ్ హామీ
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం డోనేకల్ గ్రామంలో శనివారం “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముందుగా మంత్రికి పెద్ద ఎత్తున గ్రామస్తులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, కుటుంబంలో వారు పొందిన లబ్ధి వివరాలను ఆప్యాయంగా అడిగి సావధానంగా మంత్రి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెపల్లెలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఒక నమ్మకాన్ని కల్పిస్తోందని, గత ఐదేళ్లలో వారిలో ఉన్న భయం, అశాంతత పోయిందని, ఒక భరోసా, ప్రశాంతత వచ్చిందన్నారు. గతంలో మాకు వస్తున్న పథకాలు ఏమవుతున్నాయో అనే దాని నుంచి ప్రజలు నేరుగా వచ్చి మాకు సమస్యలు తెలిపే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. డోనేకల్ గ్రామంలో మంచినీటి పైప్ లైన్ వేయలేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, 10, 15 రోజుల్లో సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు.
గ్రామంలో గతంలో 220 మందికి అమ్మఒడి పడితే, తమ ప్రభుత్వంలో 430 మందికి తల్లికి వందనం పడుతోందని, సంక్షేమంలో రెట్టింపు ఇస్తున్నామన్నారు. పెన్షన్ గతంలో 250 పెంచితే తాం 1,000 రూపాయలు పెంచామని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తుందో అప్పుడే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రశాంతంగా, ప్రజలకు స్వేచ్ఛని కల్పించే ప్రభుత్వం తమదన్నారు. ధాన్యం పండించే జిల్లాలైన గుంటూరు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల్లో నెలల పాటు గతంలో బకాయిలు చెల్లించలేదని, రైతుల నుంచి ధాన్యం తీసుకున్న 48 గంటలలోపు తాము పేమెంట్ ఇచ్చాన్నారు.
సీఎం ఆదేశాలతో రైతులు నష్టపోరాదని బర్లీ పొగాకును తాం కొంటున్నామని, మామిడి ధర పడిపోవడంతో అదనంగా డబ్బులు పెట్టి కొంటున్నామన్నారు. ఎక్కడ కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నాయో అక్కడ తమ ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ఇవాళ హంద్రీనీవాని 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, ఆ తర్వాత పిల్ల కాలువలు కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.