Suryaa.co.in

Andhra Pradesh Entertainment

చింతామణి నాటకంలో ఏముంది?

ఏపీ సర్కార్ ఎందుకు నిషేధించింది !

తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నాటకాన్ని రచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం.ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.తాజాగా ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని,సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా వ్యసనాల వైపు మళ్లించేలా నాటకం ఉందని, దీన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు.ఈ నాటకం తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.నాటకాన్ని నిషేధించడంపై ఆర్యవైశ్యులు సంతోషించారు.నాటక ప్రియులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చింతామణి తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం.ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకుంది.20వ దశాబ్దంలోని మూడవ దశకంలో సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.

ఈ నాటకం లీలాశుక చరిత్ర ఆధారంగా రచించబడినది..ఈ నాటకంలో ప్రధాన పాత్రలు చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహర, చిత్ర. వేశ్యావృత్తి, వేశ్యాలోలత వల్ల కలిగే అనర్ధాల్ని చింతామణి నాటకం చాటింది. వరకట్న దురాచారంవల్ల జరిగే కష్టనష్టాల్ని వివరించింది.వర విక్రయాన్ని, మద్యం రక్కసి కోరల్లో చిక్కి కొంపలను, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకొనే వారి జీవితాల్లోని విషాదాన్ని ఎత్తి చూపింది.మధుసేవ నాటకం ద్వారాను కాళ్ళకూరి చాలా బలంగా చిత్రీకరించారు.రచనాపరంగా, సాహిత్యపరంగా ఈ మూడు నాటకాలూ ఒకదాని కొకటి ఎంతమాత్రం తీసిపోవు.

చింతామణి నాటకం కథాంశం ఇదే..
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చెల్లి చిత్ర.
భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.
ఆమె వారి ఆస్తినంతా అపహరిస్తుంది.
భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకుంటాడు. తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు.

దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము.
అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం.
భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ.
బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది.
బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది.
ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు.
దాంతో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.

బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేస్తాడు.
అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. అత్తవారిచ్చిన అంటుమామిడి తోట అనే పద్యం ప్రసిద్దం.
ఈ నాటకాన్ని మొదటిసారిగా బందరులోని రామమోహన నాటకసంఘము వారు ప్రదర్శించారు.
1923 నాల్గవ కూర్పునాటికే సుమారు 446 సార్లు ఈ నాటకం ఆంధ్రరాష్ట్రమంతటా ప్రదర్శించబడింది.

LEAVE A RESPONSE