Suryaa.co.in

Andhra Pradesh

బద్వేలు ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలుస్తాం

– చేసిన అభివృద్ది పనులన్నీ చెప్పే ఓట్లు అడుగుతాం
– ప్రజలు కూడా తప్పనిసరిగా మమ్మల్ని ఆదరిస్తారు
– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి
వైయస్సార్‌ హయాంలోనే:
బద్వేలు ఉప ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దాదాపు 15 మంది బరిలో నిల్చారు. వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన సతీమణి డాక్టర్‌ సుధగారినే ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా నిలిపింది. ఈ నియోజకవర్గం వైయస్సార్‌ హయాంలోనే అభివృద్ధి చెందింది. ఆయన బ్రహ్మంసాగర్‌ పూర్తి చేసి, నియోజకవర్గంలోని ఏడు మండలాలకు నీరు అందేలా చూశారు.
దాదాపు 30 వేల పక్కా ఇళ్లు నిర్మించారు. ఎలా చూసినా 2004 తర్వాతే ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. మహానేత వైయస్సార్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ సీఎంలు కానీ, ఇక చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో కానీ ఏనాడూ ఈ ప్రాంతాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇక్కడి సమస్యలను విపక్షనేతగా వైయస్‌ జగన్‌ ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు.
ఈ ప్రభుత్వం వచ్చాక:
జగన్‌గారు సీఎం అయ్యాకనే బద్వేల్‌ మున్సిపాలిటీలో రోజూ తాగు నీరు సరఫరా అవుతోంది. ఈ విషయం ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీరు వదిలితే బ్రహ్మంసాగర్‌ను పూర్తిగా నింపేలా చర్యలు చేపట్టారు. అందుకే ఆ ప్రాజెక్టు నిండుతోంది. బద్వేల్‌ నియోజకవర్గం ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే, గత ఎన్నికల్లో మా అభ్యర్థికి 44 వేల మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు అంత కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది.
ఆ చరిత్ర మాది కాదు:
మేం అధికారంలో ఉన్నాం కాబట్టి, అక్రమాలు చేస్తామని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఆ చరిత్ర మాకు లేదు. మేము ఏనాడూ ఏ ఎన్నికలోనూ అక్రమాలకు పాల్పడలేదు. చిత్తశుద్ధి, నిజాయితీతో పని చేశాం తప్ప, ఎవరినీ మోసం చేయలేదు.
చేసినవే చెబుతాం:
నిజానికి కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క పథకాన్ని కూడా సీఎం ఆపలేదు. అన్నీ అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల కోడ్‌ వల్ల వైయస్సార్‌ ఆసరా రెండో విడత ఇవ్వలేదు. ఉప ఎన్నిక పూర్తి కాగానే, ఇక్కడ కూడా ఆసరా ఇవ్వడం జరుగుతుంది. వివిధ పథకాల కింద దాదాపు లక్షా నలభై వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ప్రజలకు ఇన్ని చేశాం కాబట్టే, మాకు ఓటు అడిగే హక్కు ఉంది. చేసిన పనులు చెప్పే ఓట్లు అడుగుతాం.
ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం, నాడు–నేడులో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు, గోరుముద్దలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం.. ఇలా ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు. అదే 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అలా చెప్పుకోవడానికి కనీసం ఒక్క పథకం కూడా లేదు. ప్రజలకు మేలు చేసే వారే అసలైన నాయకులు.
బద్వేలు నియోజకవర్గం:
బద్వేలు మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణం కోసం రూ.132 కోట్లకు పైగా మంజూరు చేశాం. ఎన్నికల కోడ్‌ వల్ల పనులు ఆగాయి. అవి పూర్తి కాగానే 6 నెలల్లో మొత్తం రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే శ్రీశైలం నుంచి నీరు వదిలినప్పుడు బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు వచ్చేలా సీఎంగారు అన్ని చర్యలు చేపట్టారు. సీఎం వైయస్‌ జగన్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే, అన్నీ చేస్తున్నారు. కాబట్టి మా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని.. ప్రెస్‌మీట్‌లో చీఫ్‌ విప్‌ విజ్ఞప్తి చేశారు.
అన్నీ అడ్డుకునే కుట్రలు: తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. ఎమ్మెల్యే
‘ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే, ఏం చేయాలో తోచని విపక్షం అన్నింటినీ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడాన్ని కూడా కోర్టు ద్వారా అడ్డుకున్నారు. 30 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, చాలా చోట్ల దాన్ని కూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని కూడా అడ్డుకున్నారు’.
‘బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, ప్రభుత్వానికి అంట గడుతూ బురద చల్లుతున్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ప్రజలు సీఎం వైయస్‌ జగన్‌ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో కూడా మా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు’.

LEAVE A RESPONSE