Suryaa.co.in

Andhra Pradesh

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ అన్నదాత

-రైతులను దగా చేసిన జగన్‌
-అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ అన్నదాత
-ఏటా వెయ్యి మందికి పైగా ఆత్మహత్యలు
-దేశంలోనే వారి మరణాల్లో మూడో స్థానం
-ప్రోగ్రెస్‌ కార్డుల పేరుతో కొత్త నాటకం
-దమ్ముంటే చర్చకు సిద్ధమా?
-తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

జగన్‌ రెడ్డి దగా పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రైతులను నిట్ట నిలువునా ముంచి ప్రోగ్రెస్‌ కార్డుల పేరుతో మళ్లీ మోసానికి జగన్‌ తెరలేపారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మనిషిపై సగటు అప్పు రూ.75 వేలు ఉంటే.. జగన్‌ రెడ్డి పాలనలో మాత్రం ప్రతి రైతు కుంటుబంపై రూ. 2.54 లక్షల వరకు అప్పు ఉందని తెలిపారు.

ఐదు రబీ కాలాలు, ఐదు ఖరీఫ్‌ కాలాల్లో రైతులను జగన్‌ నిలువునా ముంచడంతో పెట్టిన పెట్టుబడి రాక ప్రభుత్వం ఆదుకోక రైతులు అప్పులు తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు. పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టి నకిలీ పత్తి విత్తనాలు అమ్ముకుని రైతులను వైసీపీ నేతలు నట్టేట ముంచారన్నారు. ధాన్యం సేకరణ, రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతుల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టి రైతులను నిలువునా ముంచారన్నారు. ఏటా 1000కి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందని, మొత్తం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానంలో ఉండటం దారుణమన్నారు.

ఉత్తరాంధ్రలో జీడి రైతులను ముంచి చెరకు రైతులను ఏడిపించి, కోనసీమలో కొబ్బరి రైతులకు కన్నీళ్లు తెప్పించి, రాయలసీమలో మామిరెడ్డి రైతులను పెద్దిరెడ్డి దోచుకుంటూ ఉంటే చూస్తూ ఉండి.. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలలో మిరప రైతులు చీడపీడలతో విలపిస్తున్నా పట్టించు కోకుండా మళ్లీ ఓట్లను దండుకునేందుకు ప్రోగ్రెస్‌ పేరుతో కొత్త నాటకానికి తెరలేపడానికి కాస్తయినా సిగ్గుండాలని హితవుపలికారు.

వైసీపీ నాయకులు దళారులుగా మారి మిల్లర్లను లోబరుచుకుని, ప్రభుత్వ అధికారులను బెదిరించి మంత్రి సజ్జల, జగన్‌ ఆశీస్సులతో ధాన్యం సేకరణలో 20 శాతం తీసుకుని ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టిన ఘనులు ఈ జే గ్యాంగ్‌ అన్నారు. ఈ విషయం వైసీపీ మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోషే స్సష్టం చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ప్రతి క్వింటాకు నాలుగు నుంచి ఏడు కిలోలు బొక్కుతూ.. క్వింటాకు రూ.700 తగ్గించి ఇచ్చి రైతుల దగ్గర పెద్ద ఎత్తున దండుకున్నారన్నారు. ఏ అంశంపై అయినా ఏ ప్రోగ్రెస్‌ కార్డు తీసుకువస్తావో రా…చర్చించడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు.

LEAVE A RESPONSE