Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కాసుకో.. అసెంబ్లీ టైగర్ వస్తోంది!

– ఉండిలో కోలాహలం మధ్య రఘురామకృష్ణంరాజు ప్రచారం

ఉండిలో టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, పలు అపార్టుమెంట్లలో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయనతో కలసి ఫొటోలు తీసుకునేందుకు ఓటర్లు పోటీ పడ్డారు. ముఖ్యంగా మహిళలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. మా ఓట్లు మీకేనని భరోసా ఇచ్చారు. మరికొంతమంది అభిమానులు ‘జగన్ కాసుకో.. అసెంబ్లీ టైగర్ వస్తోంది’ అంటూ నినాదాలు చేశారు. పలువురు వృద్ధులు రాజును ఆశీర్వదించారు. అసెంబ్లీకి సైకిల్, పార్లమెంటుకు కమలం గుర్తుకు ఓటేయాలని ఆయన ఓటర్లను కోరారు.

‘‘నామినేషన్‌కు ముందునుంచే ప్రచారం ప్రారంభించినా ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని అభిమానించినందుకు కృతజ్ఞతలు. గ్రామాల్లో మాకు బ్రహ్మరథం పట్టినందుకు వారి మేలు మరవను. మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన మా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి, ఓటర్లలో చైతన్యం నింపింది. ఉండిలో మా ఓట్లు చీల్చి శునకానందం పొందాలనుకునేవారికి చంద్రబాబు ఇచ్చిన సందేశమే వాత పెట్టింది. ప్రజలు సైకిల్ గుర్తుకే వేస్తారు. నేను ముందే చెప్పినట్లు చంద్రబాబు ఇక్కడ, మోదీ అక్కడ సీఎం-పీఎంలు ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. జగన్ ఇక ఇప్పటినుంచే చుక్కలు లేదా చువ్వలు లెక్కబెట్టుకోవడం మంచిది’’ అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE