22 యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్రం నిషేధం

– కేంద్ర సమాచార, ప్రసారశాఖ నిర్ణయం

సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్‌ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా 22 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్‌ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి.

ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ వెల్లడించింది. అయితే, యూట్యూబ్‌ ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదేతొలిసారి కావడం విశేషం.

భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్‌ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గ్రహించింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్‌ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

నిషేధం విధించిన ఈ యూట్యూబ్‌ ఛానెళ్ల మొత్తం వీక్షణల సంఖ్య 260 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఆయా ఛానెళ్లు తమ కార్యక్రమాలను నడిపిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా అవాస్తవ సమాచారం వైరల్‌గా మారేందుకు ఇమేజ్‌లు, టైటిళ్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు తెలిపింది.

పాకిస్థాన్‌ ఛానెళ్లు కూడా ఇదే విధంగా భారత్‌కు వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లో విశ్వసనీయమైన, ప్రామాణిక వార్తల ప్రసారాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

Leave a Reply