Home » విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు

విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్

ఢిల్లీ: విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని కోరిన‌ట్లు టి.జి భ‌ర‌త్ చెప్పారు.

ఈ విష‌యంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. విజయవాడ నుండి కర్నూలుకు విమాన స‌ర్వీసులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని, ఏడాదిలోపు రాత్రి స‌మ‌యాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తాన‌ని కేంద్ర మంత్రి చెప్పార‌న్నారు. ఈ మేర‌కు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు.

క‌ర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వ‌స్తే ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు టి.జి భ‌ర‌త్ తెలిపారు.

Leave a Reply